రూ. 15 వేల నుంచి రూ. 25 వేలకు ఈపీఎఫ్ఓ వేతన పరిమితి పెంపు.. దీనివల్ల వచ్చే మార్పులేంటి?

ఫొటో సోర్స్, Getty Images
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) కింద తప్పనిసరి కవరేజ్ కోసం ఉండే వేతన పరిమితిని పెంచేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
దీనికోసం ఇప్పటి వరకు నెలకు రూ. 15 వేలుగా ఉన్న వేతన పరిమితిని, ప్రస్తుతం నెలకు రూ. 25 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించింది.
కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ నిర్ణయం ప్రకటించారు. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఈ ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపిందని పేర్కొన్నారు.
ఈపీఎఫ్ఓ కింద లభించే తప్పనిసరి కవరేజీలో.. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్), ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్), ఎంప్లాయీస్ డిడక్టిబుల్ లైఫ్ ఇన్సూరెన్స్ (ఈడీఎల్ఐ) ప్రయోజనాలు ఉన్నాయి.
ఇప్పటి వరకు ఈ ప్రయోజనాలు కేవలం రూ. 15 వేల వరకు సంపాదించే వారికి మాత్రమే అందుబాటులో ఉండేవి. కానీ, ఇప్పుడు ఈ ప్రయోజనాలను రూ.25 వేలు పొందే వారికి కూడా లభించనున్నాయి. అంటే.. రూ.25 వేల వరకు సంపాదించే వారు కూడా ఈ ప్రయోజనాలకు అర్హులు.


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలోనే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కింద తప్పనిసరి కవరేజీ కోసం ఉండే వేతన పరిమితిని నెలకు రూ. 15,000 నుంచి రూ. 25,000కు పెంచారు.

ఈ నిర్ణయం వల్ల అదనంగా 51 లక్షలకు పైగా ఉద్యోగులు ఈపీఎఫ్ఓ పరిధిలోకి వస్తారని ప్రభుత్వం చెబుతోంది.
అంతేకాకుండా.. ఇది కార్మికులకు సామాజిక భద్రతను పెంచుతుందని భావిస్తున్నారు.

2004 నుంచి 2014 మధ్య దశాబ్ద కాలంలో ఈపీఎఫ్ఓ వేతన పరిమితిలో ఎలాంటి మార్పు లేదు.
2014 సెప్టెంబర్లో దీనిని నెలకు రూ. 15,000కు పెంచారు.

గత కొన్ని సంవత్సరాలలో జీతాల నిరంతర పెరుగుదల, ఆదాయ వృద్ధి, వ్యవస్థీకృత ఉపాధి (ఫార్మల్ ఎంప్లాయ్మెంట్) విస్తరణను దృష్టిలో ఉంచుకుని, వేతన పరిమితిని రూ. 25,000కు పెంచినట్లు ప్రభుత్వం తెలిపింది.
అనేక రాష్ట్రాలు, వ్యాపార సంస్థలలో కనీస వేతనాలు కూడా ప్రస్తుత పరిమితికి చేరువయ్యాయని ప్రభుత్వం చెబుతోంది.

ఫొటో సోర్స్, Getty Images

ప్రస్తుతం నెలకు రూ.15 వేల కంటే ఎక్కువ జీతంతో ఉద్యోగంలో చేరే కొత్త ఉద్యోగి ఈపీఎఫ్ పరిధిలోకి ఆటోమేటిక్గా రారు.
ఇలాంటి ఉద్యోగులను కంపల్సరీ ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్, దానికి సంబంధించిన బీమా రక్షణ నుంచి మినహాయించారు.

రూ.15 వేల నుంచి రూ.25 వేల మధ్య పే బ్యాండ్ ఉన్న ఉద్యోగుల్లో ఎక్కువ మంది తప్పనిసరిగా అందించాల్సిన సోషల్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్లోకి వస్తారు.

ఆమోదం పొందిన తర్వాత అమల్లోకి వచ్చే ఈ పథకం, ప్రావిడెంట్ ఫండ్ పొదుపు, ఉద్యోగుల పెన్షన్ పథకం (ఈపీఎఫ్) కింద పెన్షన్ రక్షణ, ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ (ఈడీఎల్ఐ) కింద బీమా రక్షణకు విస్తరిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images

ప్రస్తుత జీతాల స్థాయిలకు అనుగుణంగా చట్టబద్ధమైన కంట్రిబ్యూషన్, పెన్షన్ అర్హత గల వేతన నిర్మాణాన్ని మరింత మెరుగ్గా సమన్వయం చేయడానికి ఇది సాయపడుతుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.
ఈ కొత్త పరిమితి పెరుగుతున్న వేతన స్థాయిలకు తగినట్లుగా ఈపీఎఫ్ఓ వ్యవస్థను అప్డేట్ చేస్తుందని, మరింత మంది కార్మికులకు అధికారిక సామాజిక భద్రతా ప్రయోజనాలను విస్తరిస్తుందని తెలిపింది.

తప్పనిసరి సామాజిక భద్రత కోసం ప్రస్తుత కేటాయింపు సుమారుగా రూ.10,250 కోట్లు ఖర్చు పెడుతుంది. ఈ కొత్త మార్పుతో ఇది సుమారుగా రూ.11,339 కోట్లకు పెరుగుతుంది.
ఐదేళ్లలో అంచనా వ్యయం సుమారు రూ. 56,696 కోట్లు ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది.
ఈపీఎఫ్ఓ ప్రపంచంలోనే అతిపెద్ద సామాజిక భద్రతా వ్యవస్థలలో ఒకదానిని నడుపుతోంది.
ఇది ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్), ఉద్యోగుల పెన్షన్ పథకం (ఈపీఎస్), ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్లను (ఈడీఎల్ఐ) నిర్వహిస్తుంది.
తాజా ఈపీఎఫ్ఓ గణాంకాల ప్రకారం.. సుమారు 7.68 లక్షల సంస్థలలో దాదాపు 7.98 కోట్ల మంది సభ్యులు ఉండగా, ఈపీఎస్ సుమారు 82 లక్షల మంది పెన్షనర్లకు పించను ప్రయోజనాలను అందిస్తోంది.
ఈపీఎఫ్ సభ్యత్వానికి అనుసంధానించిన బీమా కవరేజీని ఈడీఎల్ఐ అందిస్తోంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)




























