'విద్య కంటే ముందు మీడియా సంస్కరణలు అవసరం' అని డాక్టర్ గీతాంజలి ఎందుకన్నారు?

ఫొటో సోర్స్, Ishant Chauhan/Hindustan Times via Getty Images
విద్య కంటే ముందు మీడియా మెరుగుపడాల్సిన అవసరముందని సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ భార్య డాక్టర్ గీతాంజలి ఆంగ్మో అన్నారు.
"అందరూ విద్యా సంస్కరణల గురించి డిమాండ్ చేస్తున్నారు. అది మంచిదే. కానీ, ఆ సంస్కరణలేవో మీడియాతో మొదలుపెట్టగలమా?" అని డాక్టర్ గీతాంజలి ఎక్స్లో చేసిన పోస్టులో ప్రశ్నించారు.
"నిత్యం వండివార్చిన కథనాలతో దేశం వివేకవంతం కాలేదు. అది ఒకే మూసధోరణి వైపు లాక్కెళ్తుంది."
"ఈ రోజు మనపై ఎక్కువగా ప్రభావం చూపుతోంది ఉపాధ్యాయులు కాదు. టీవీ స్టూడియోలు, వాట్సాప్ ఫార్వర్డ్లు, యూట్యూబ్ చానెళ్లు, సోషల్ మీడియా ట్రోల్స్. వీటిలో కొన్ని మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోకుండానే ద్వేషించడం, కనీసం ఆలోచించకుండానే స్పందించడం, నిజం తెలుసుకోకుండానే ఆ కథలను నమ్మేలా చేస్తాయి" అని ఆమె రాశారు.
"మనల్ని మనం అంధభక్తులమని అనుకున్నా, మరేదైనా రాజకీయ గుర్తింపుతో పిలుచుకున్నా, మనందరం ఎంతోకొంత పక్షపాత ధోరణికి, సంకుచిత మనస్తత్వానికి లోనయ్యాం."
విద్యా సంస్కరణల గురించి తర్వాత మాట్లాడదాం, ముందు మీడియా సంస్కరణలు రావాల్సిన అవసరముందని ఆమె ఆ పోస్టులో రాశారు.







