అమిత్ షాకు రాహుల్ గాంధీ లేఖ

ఫొటో సోర్స్, Arvind Yadav/Hindustan Times via Getty Images
దిల్లీలో నిరసన చేస్తున్న విద్యార్థులపై బలగాలను ప్రయోగించిన ఘటనకు బాధ్యత ఎవరిదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఆయన ఓ లేఖ రాశారు.
నిరసన చేస్తున్న ప్రజలను రక్షించడం, చర్చల ద్వారా వారి సమస్యలను పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యత అని రాహుల్ గాంధీ అన్నారు.
"మా విద్యార్థులు నిష్పక్షపాతమైన, జవాబుదారీతనం ఉన్న విద్యా వ్యవస్థను కోరుతున్నారు. వారి మాట వినడానికి బదులుగా , భద్రతా దళాలు వారిపై బలప్రయోగం చేశాయి. ప్రాణాంతక ఆయుధాలు, టియర్ గ్యాస్ ప్రయోగించాయి. వందలాది మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. మహిళా విద్యార్థులపైనా దాడి చేశారు. వారి ప్రైవేట్ పార్టులను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుని కూడా దాడి చేశారు’’ అని ఆ లేఖలో రాహుల్ గాంధీ రాశారు.
"ప్రాణాంతకమైన పెల్లెట్ గన్లను ఉపయోగించడం అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయం. ఒక జర్నలిస్టుతో సహా చాలా మంది తీవ్రంగా గాయపడ్డారని మీడియా, సోషల్ మీడియాలో కథనాలొచ్చాయి. నేను 19 ఏళ్ల విద్యార్థి సాహిల్ లోచాబ్ను కలిశాను.పెల్లెట్ గన్తో కాల్చడంతో ఆయనిప్పుప్పుడు తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నారు. ఒక కన్ను కోల్పోయే ప్రమాదం కూడా ఉంది’’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
లేఖలో రాహుల్ గాంధీ రెండు ప్రశ్నలు అడిగారు.
" విద్యార్థులపై పెల్లెట్ గన్లతో సహా ప్రాణాంతకమైన బలప్రయోగానికి హోం మంత్రిగా మీరు అనుమతిచ్చారా? ఒకవేళ మీరు కాకపోతే ఎవరు అనుమతిచ్చారు?
సాధారణ దుస్తుల్లో విద్యార్థులను లాఠీలతో కొడుతున్నట్టు కనిపించిన వారు పోలీసులా లేక వాలంటీర్లా? వారిని మోహరించడానికి ఎవరు అధికారం ఇచ్చారు?"
దేశ భవిష్యత్తు అయిన యువత, విద్యార్థులు ఈ ఘటనపై సమాధానాలు, జవాబుదారీతనం కోరుతున్నారని రాహుల్ గాంధీ లేఖలో రాశారు.




