నేపాల్ ఆకస్మిక వరదల్లో ఏయే దేశాల వారు ఎంతమంది గల్లంతయ్యారు?

నేపాల్ వరదలు

ఫొటో సోర్స్, Reuters

    • రచయిత, సంజయ్ ధకల్
    • హోదా, బీబీసీ న్యూస్ నేపాలీ
  • ప్రచురణ
  • చదివే సమయం: 4 నిమిషాలు

నేపాల్ వరదల్లో లభ్యమవుతున్న మృతదేహాల సంఖ్య పెరుగుతున్న కొద్దీ, వరదల కారణంగా సంబంధాలు తెగిపోయిన పర్యటకుల సంఖ్య కూడా పెరుగుతోందని అధికారులు తెలిపారు.

గురువారం మధ్యాహ్నం 12 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం, వరదల కారణంగా 644 మంది పర్యటకులు సంబంధాలు కోల్పోయారని నేపాల్ పర్యటక బోర్డు పేర్కొంది.

వీరంతా, నేపాల్, భారత్ సహా 33 వేర్వేరు దేశాలకు చెందినవారని సమాచారం.

ఇలా సంబంధాలు తెగిపోయినవారిలో అత్యధికులు భారతీయులేనని బోర్డు ప్రతినిధి సునీల్ శర్మ బీబీసీకి తెలిపారు.

మొత్తం 178 మంది భారతీయుల సమాచారం తెలియడం లేదని ఆయన అన్నారు. అదేవిధంగా, 127 మంది నేపాలీ పర్యటకులు, 65 మంది అమెరికన్లు, 53 మంది యుక్రేనియన్లు, 51 మంది మలేషియన్లు, 35 మంది ఆస్ట్రేలియన్లు, 33 మంది యూకే పర్యటకుల ఆచూకీ కూడా తెలియడం లేదని ఆయన చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

పర్యటకుల గురించి సమాచార సేకరణకు వివిధ టూర్ ఆపరేటర్లతో కలిసి పనిచేస్తున్నామని నేపాల్ టూరిస్ట్ పోలీస్ డీఎస్పీ బిశ్వరాజ్ అధికారి తెలిపారు.

రసువా నుండి రక్షించిన 23 మంది పర్యటకులను నువాకోట్‌కు తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు. అయితే, వారి జాతీయతకు సంబంధించిన సమాచారం ఇంకా అందలేదన్నారు.

తైమూర్ ప్రాంతంలో గల్లంతైన 21 మంది భారతీయ పర్యాటకులను నేపాల్ సైన్యం రక్షించి, వారిని కాఠ్మండుకు తీసుకువస్తోందని ప్రధానమంత్రి కార్యాలయం అంతకుముందు పేర్కొంది.

వరద బీభత్సం

ఫొటో సోర్స్, Nepal Photo Library

వరద ప్రభావిత ప్రాంతాల్లోని భారతీయుల పరిస్థితిని తెలుసుకోడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తెలిపారు.

"ఈ విషయంలోనూ, సహాయక చర్యల విషయంలోనూ మేము నేపాల్ పక్షంతో సన్నిహితంగా కలిసి పనిచేస్తున్నాము," అని ఆయన అన్నారు.

గురువారం మధ్యాహ్నం 12 గంటల నాటికి నేపాల్ పర్యటక బోర్డు అందించిన సమాచారం ప్రకారం, 33 దేశాలకు చెందిన పర్యాటకుల సమాచారం తెలియడం లేదు.

రహదారులు,భవనాలకు రూ.1500 కోట్ల నష్టం

నేపాల్‌లో బుధవారం సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా రోడ్లు, వంతెనలు సహా మౌలిక వసతులు దెబ్బతిని 1500 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని రహదారుల విభాగాధిపతి బీబీసీకి చెప్పారు.

"మొత్తం 19 బ్రిడ్జిలు, 40 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి. 1500 కోట్లరూపాయలకుపైగా పైగా నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనా" అని రహదారుల విభాగం డైరెక్టర్ జనరల్ విజయ్ జైసీ వెల్లడించారు.

వరదల వల్ల కలిగిన నష్టాన్ని కచ్చితంగా అంచనా వేయడానికి ఇంకా సమయం పడుతుందని అధికారులు స్పష్టం చేశారు.

బ్రిడ్జిలు కూలిపోయిన చోట గురువారం నుంచి బెయిలీ బ్రిడ్జిలను ఏర్పాటు చేయనున్నట్లు విజయ్ జైసీ తెలిపారు. "మా దగ్గర బెయిలీ బ్రిడ్జిలు ఉన్నాయి. భారత్, చైనా వంటి మిత్ర దేశాలనూ వాటిని అందించాలని కోరాం" అని చెప్పారు. అయితే ఈ రెండు దేశాల నుంచి ఎన్ని బ్రిడ్జీలను కోరారనే సంఖ్యను అధికారులు వెల్లడించలేదు.

రహదారులపై పేరుకుపోయిన బురదను తొలగించే పనులు మొదలుపెట్టినట్టు అధికారులు చెప్పారు

ఫొటో సోర్స్, RSS

ఫొటో క్యాప్షన్, రహదారులపై పేరుకుపోయిన బురదను తొలగించే పనులు మొదలుపెట్టినట్టు అధికారులు చెప్పారు

నేపాల్ ప్రధానమంత్రిని బాలేంద్ర షాతో మాట్లాడి సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పానని భారత ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం తెలిపారు.

"నేపాల్‌కు అన్ని విధాలుగా సాధ్యమైనంత మానవతా సహాయం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉంది. రక్షణ, సహాయక చర్యలను మా బృందాలు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటున్నాయి." అని మోదీ సామాజిక మాధ్యమాల వేదికగా చెప్పారు.

ఆకస్మికంగా పోటెత్తిన వరదల కారణంగా అనేక చోట్ల రహదారి వ్యవస్థ మొత్తం దెబ్బతిందని అధికారులు చెప్పారు.

స్యాఫ్రుబేసి, రసువాగడి మధ్య సమాచార వ్యవస్థ పూర్తిగా తెగిపోయిందని జైసీ వెల్లడించారు.

గతేడాది వరదల అనంతరం చైనా సహాకారంతో పునర్నిర్మిస్తున్న అనేక రోడ్లు తాజా వరదల కారణంగా మరోసారి ఛిద్రమయ్యాయి.

"ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న రోడ్లకు ఎంత మేర నష్టం వాటిల్లిందో చెప్పడం సాధ్యం కాదు" అని జైసీ పేర్కొన్నారు.

నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్‌మెంట్ అథారిటీ ప్రకారం టిబెట్‌లో హిమపాతం, అనంతరం మంచు కరగడం వల్ల రసువాలో వరద సంభవించినట్లు తొలుత అంచనా వేసింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)