
లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన
లోక్సభ సీట్ల సంఖ్య 815కి పెంచితే వచ్చే మార్పు ఏంటి?
గడిచిన ఐదున్నర దశాబ్దాల కాలంలో భారత జనాభా భారీగా పెరిగింది. 1971లో 54 కోట్ల జనాభా ఉంటే 2026నాటికి ఈ సంఖ్య 142 కోట్లకు పెరిగిందని అంచనా. అంటే 55ఏళ్ల కాలంలో జనాభా 163 శాతం పెరిగింది.
కానీ, లోక్సభ సీట్ల సంఖ్య మాత్రం చాలా వరకు అలాగే ఉంది. 1977 నుంచి ఇప్పటివరకు ఒక్క సీటు మాత్రమే పెరిగింది. 1987లో గోెవా, డయ్యూ డామన్ విడిపోయిన తర్వాత ఈ సీటు పెరిగింది. అలా మొత్తం సీట్ల సంఖ్య ప్రస్తుతమున్న 543కి చేరింది.
లోక్సభలో సీట్ల పెంపుతో పాటు మహిళా రిజర్వేషన్లకు ఉద్దేశించిన బిల్లులను కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ ఏప్రిల్ 16న పార్లమెంటులో ప్రవేశపెట్టారు.
లోక్సభలో సభ్యుల సంఖ్య 50 శాతం పెరిగి 815కి చేరుకుంటుందని, ఇందులో 272 స్థానాలను మహిళల కోసం రిజర్వ్ చేస్తారని మేఘ్వాల్ చెప్పారు. "మహిళా రిజర్వేషన్లను అమలు చేయడం వల్ల పురుషులు లేదా రాష్ట్రాలకు ఎలాంటి నష్టం కలగదు" అని ఆయన అన్నారు.
2023 సెప్టెంబర్లో ఆమోదం పొందిన నారీశక్తి వందన్ అభియాన్ లేదా మహిళా రిజర్వేషన్ చట్టం.. మహిళలకు లోక్సభ, రాష్ట్రాల చట్ట సభల్లో 33శాతం సీట్లు కేటాయించింది. ఈ రిజర్వేషన్ ప్రక్రియ ప్రస్తుతం జరుగుతున్న జనగణనతో ముడిపడి ఉంది. దీన్ని 2029 ఎన్నికల్లో అమలు చేయడం సాధ్యం కాదు. అందుకే మహిళా రిజర్వేషన్ చట్టానికి సవరణలు ప్రవేశపెట్టామని మేఘ్వాల్ చెప్పారు.

ఇక్కడున్న ప్రతి చతురస్రం లోక్సభలోని ఒక సీటును సూచిస్తుంది. మొత్తం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి ప్రస్తుతం 543 స్థానాలున్నాయి.

ప్రభుత్వం ఇప్పుడు లోక్సభ సభ్యుల సంఖ్యను 815కి పెంచాలని ప్రతిపాదించింది. ప్రస్తుతం ఉన్న 543 సీట్లు 50 శాతం పెరుగుతాయి. ఈ 815 సీట్లలో 272 సీట్లను మహిళలకు రిజర్వ్ చేస్తారు.
దీనర్థం ఏంటటే ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో 80 లోక్సభ స్థానాలున్నాయి. ఆ రాష్ట్రానికి లోక్సభలో 14.7 శాతం ప్రాతినిధ్యం ఉంది. 815 సీట్లున్న లోక్సభలో ఉత్తరప్రదేశ్ ఎంపీల సంఖ్య 120కి పెరుగుతుంది.
అలాగే కేరళలో ప్రస్తుతం 20 లోక్సభ స్థానాలున్నాయి. డీలిమిటేషన్ తర్వాత కేరళలో లోక్సభ స్థానాల సంఖ్య 30కి చేరుతుంది. లోక్సభలో ఆ రాష్ట్ర ప్రాతినిధ్యం 3.7 శాతంగా ఉంటుంది.
దీని వల్ల ఉత్తరప్రదేశ్ ఎక్కువగా లాభపడుతుంది. ఆ రాష్ట్రానికి అదనంగా 40 లోక్సభ స్థానాలు దక్కుతాయి.డీలిమిటేషన్ వల్ల మహారాష్ట్రలో 24, పశ్చిమ బెంగాల్లో 21, బిహార్, తమిళనాడుల్లో 20 లోక్సభ స్థానాలు పెరుగుతాయి.
815 స్థానాలున్న లోక్సభలో ఏ రాష్ట్రానికి ఎన్ని లోక్సభ స్థానాలు ఉంటాయనే దాన్ని కింద ఉన్న మ్యాపు చూపిస్తుంది. బాక్స్ పరిమాణం ఎంత పెద్దగా ఉంటే, ఆ రాష్ట్రానికి సీట్లు అంత ఎక్కువగా ఉన్నట్లు.
ప్రతిపాదిత మూడు బిల్లుల్లో కీలకమైన మార్పులు ఉన్నాయి:
ప్రస్తుతం లోక్సభ స్థానాల విషయంలో ఉన్న రాజ్యాంగపరమైన పరిమితిని 550 నుంచి 850కి పెంచడం
రాష్ట్రాలకు లోక్సభలో సీట్లను కేటాయించడం, నియోజకవర్గాల సరిహద్దుల పునర్విభన, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, మహిళలకు సీట్లను రిజర్వ్ చేయడం వంటి పనులు చేపట్టేందుకు కమిషన్ ఏర్పాటు చేయడం.
కమిషన్ తాజా గణాంకాలను వినియోగించుకోవాలని పేర్కొనడంతో 2011 జనగణనలో లెక్కల్ని తీసుకుంటుంది.
రాష్ట్రాల్లో లోక్సభ స్థానాలు 50శాతం పెరుగుతాయని పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లుల్లో ఎక్కడా పేర్కొనకపోవడం గమనార్హం. అయితే దీనిపై కేంద్ర మంత్రులు సహా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా నోటిమాటగా హామీ ఇచ్చారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ మాట్లాడుతూ, "కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టాలనుకుంటున్న డీలిమిటేషన్ సవరణ బిల్లు, తమిళనాడు, దక్షిణ రాష్ట్రాలపై మోపే అతిపెద్ద చారిత్రక అన్యాయం" అని అన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రికి రాసిన బహిరంగ లేఖలో, జాతీయ ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన సహకారం అందిస్తున్నప్పటికీ పార్లమెంటులో దక్షిణ రాష్ట్రాల గొంతుక క్షీణిస్తుందని, అదే సమయంలో ఉత్తర-మధ్య భారతదేశంలోని అధిక జనాభా వృద్ధి ఉన్న రాష్ట్రాలు అసమానంగా లాభపడతాయని పేర్కొన్నారు.
ఆర్థిక సహకారంలో రాష్ట్రాల పనితీరును పరిగణనలోకి తీసుకునేలా సీట్ల కేటాయింపు కోసం రేవంత్ రెడ్డి ఒక ప్రత్యామ్నాయ సూత్రాన్ని కూడా ప్రతిపాదించారు.
లోక్సభ సీట్లను ఎందుకు తిరిగి సర్దుబాటుచేయాలి?
గత అర్ధ శతాబ్ద కాలంలో భారత జనాభా 2.5 రెట్లు పెరిగినప్పటికీ, ఈ వృద్ధి అన్ని రాష్ట్రాల్లో ఒకేలా లేదు.
రాజస్థాన్, బిహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రాల్లో 1971 నుంచి 2027 మధ్య జనాభా దాదాపు 190 శాతం నుంచి 220 శాతం వరకు పెరుగుతుందని అంచనా.
2027 జనాభా అంచనాలు పాపులేషన్ ప్రొజెక్షన్స్ అనే టెక్నికల్ గ్రూప్ రిపోర్ట్ నుంచి తీసుకున్నారు.
దీనికి భిన్నంగా కేరళలో కేవలం 70 శాతం, తమిళనాడులో 88 శాతం జనాభా పెరుగుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 113 శాతం, కర్ణాటకలో 137 శాతం పెరుగుతుందని అంచనా.
దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో భారత సగటుతో పోలిస్తే కొన్నేళ్లుగా జనాభా పెరుగుదల చాలా నెమ్మదిగా ఉంది. జనాభా పెరుగుదలలో ఈ అసమానత వల్ల ఒక ఎంపీ ప్రాతినిధ్యం వహించే ప్రజల సంఖ్యలో తేడా కనిపిస్తుంది.
రాజస్థాన్లో ఒక ఎంపీ సగటున 33 లక్షల మందికి ప్రాతినిధ్యం వహిస్తారు. ఇది ఖతార్ జనాభా కన్నా ఎక్కువ. దీనికి భిన్నంగా కేరళలో ఓ ఎంపీ ఇందులో దాదాపు సగం జనాభాకు మాత్రమే లేదా 18 లక్షల మందికి ప్రాతినిధ్యం వహిస్తారు.
ఒక ఎంపీ ప్రాతినిధ్యం వహించే ప్రజల సంఖ్య(లక్షల్లో)

1977లో ఆరో లోక్సభ ఎన్నికలు జరిగిన సమయంలో అన్ని పెద్ద రాష్ట్రాల్లో ఎంపీలు సగటున సుమారు 10 లక్షల 40 వేల మందికి ప్రాతినిధ్యం వహించారు.
ఒకవేళ లోక్సభలో సీట్ల సంఖ్య 543గానే ఉంటే, ఉత్తరప్రదేశ్లో ఒక ఎంపీ సుమారు 30 లక్షల మందికి ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుంది. కర్ణాటక లేదా తమిళనాడులో ఒక ఎంపీ ప్రాతినిధ్యం వహించే ప్రజల సంఖ్య కన్నా ఇది చాలా ఎక్కువ.
లోక్సభ సభ్యుల సంఖ్య 815కి పెరిగినా అసమానత తొలగిపోదు. ఒక్కో ఎంపీ ప్రాతినిధ్యం వహించే జనాభా సంఖ్య తగ్గినప్పటికీ, వ్యత్యాసం మాత్రం అలాగే ఉంటుంది. ఉత్తరప్రదేశ్లో ఒక ఎంపీ ఇప్పటికీ సుమారు 20.4 లక్షల మందికి ప్రాతినిధ్యం వహిస్తారు, అదే కేరళలో ఒక్కో ఎంపీకి సుమారు 12 లక్షల మంది జనాభా మాత్రమే ఉంటారు.
రాష్ట్రాల మధ్య నియోజకవర్గాల జనాభాలో పెరుగుతున్న ఈ వ్యత్యాసం భారతదేశానికి దీర్ఘకాలిక రాజకీయ సవాలుగా మారింది. 1970ల నుంచి పునర్విభజన స్తంభింపజేయడమే దీనికి కారణం.
డీలిమిటేషన్ అంటే సింపుల్ భాషలో సరిహద్దులను తిరిగి నిర్వచించడం. ప్రతి పదేళ్లకోసారి జనగణన నిర్వహించిన తర్వాత జనాభాలో వచ్చిన మార్పులకు తగ్గట్టుగా నియోజకవర్గాల పునర్విభజన చేయాలని అర్థం. జనాభాకు తగ్గట్టుగా రాష్ట్రాలకు సీట్ల కేటాయింపునకు హామీ ఇవ్వడం, ప్రతి ఎంపీ లేదా ప్రతినిధి దాదాపు ఒకే సంఖ్యలో ప్రజలకు ప్రాతినిధ్యం వహించేలా చేయడం దీని ఉద్దేశం.
రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 81, 82 ద్వారా ఈ ప్రక్రియను తప్పనిసరి చేశారు. సీటు-జనాభా నిష్పత్తి సాధ్యమైనంత మేర అన్ని రాష్ట్రాల్లో ఒకేలా ఉండాలని ఆర్టికల్ 81 తెలియజేస్తుంది. ప్రతి జనగణన తర్వాత లోక్సభలో సీట్లను తిరిగి సర్దుబాటు చేయాలని ఆర్టికల్ 82 తెలియజేస్తుంది.
సరిహద్దుల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను రాజ్యాంగానికి చేసిన 42వ సవరణ ద్వారా 1976లో నిలిపివేశారు. 2001 జనాభా లెక్కలు బయటకు వచ్చేవరకు దీన్ని కొనసాగించాలని నిర్ణయించారు. రాష్ట్రాలు జనాభా పెరుగుదలను నియంత్రించుకునేలా సమయం ఇవ్వడం దీని ఉద్దేశం.
‘రాష్ట్రాలు జనాభా నియంత్రణ పాటించేలా ప్రోత్సహించేందుకు’ 2002లో 84వ రాజ్యాంగ సవరణ ద్వారా డీలిమిటేషన్ను 2026 వరకు నిలిపివేశారు. అంటే 2026 తర్వాత నిర్వహించే మొదటి జనగణన వరకు డీలిమిటేషన్ను వాయిదా వేశారు.
అయినప్పటికీ, ‘తాజా జనాభా లెక్కల అధికారిక గణాంకాలు’ లేదా ‘2011 జనాభా లెక్కల’ ప్రకారం డీలిమిటేషన్ నిర్వహించాలని ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది.
2021లో జరగాల్సిన గత జనగణన ప్రక్రియ నిరవధికంగా వాయిదా పడింది. 2027లో జనాభా గణనను నిర్వహిస్తామని 2025 జూన్లో కేంద్ర హోం శాఖ ప్రకటించింది. ప్రస్తుతం 2027 జనగణన మొదటి దశ కొనసాగుతోంది.
నియోజకవర్గాల పునర్విభజన నిలిచిపోవడం, జనాభా పెరుగుదలలో విస్తృత తేడా పెరగడం వల్ల కాలక్రమేణా భారత్లో కొన్ని రాష్ట్రాలకు తక్కువ ప్రాతినిధ్యం ఉంటోంది. మరికొన్ని రాష్ట్రాలు చాలా ఎక్కువ ప్రాతినిధ్యం పొందుతున్నాయి.
పంకజ్ పటేల్, టీవీ శేఖర్ తమ 2024 పరిశోధనా వ్యాసంలో (జర్నల్ ఆఫ్ ఏషియన్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్) పేర్కొన్నట్లుగా, "సుసంపన్న రాష్ట్రాలు, ప్రత్యేకించి దక్షిణ భారత దేశంలోని రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు, మెరుగైన ఆరోగ్యసంరక్షణ, ఉన్నతస్థాయి విద్య వల్ల లాభం పొందాయి. ఇది జనాభా పెరుగుదలను నియంత్రించింది. ఆయా రాష్ట్రాల్లో జనాభాతో పోలిస్తే ఎక్కువ పార్లమెంట్ సీట్లున్నాయి. అంటే వారికి రాజకీయంగా ఎక్కువ ప్రాతినిధ్యం లభించింది".
అదే సమయంలో జననాల రేటు ఎక్కువగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రాతినిధ్యం తక్కువగా ఉంది. వాటి జనాభాతో పోలిస్తే తక్కువ సీట్లు ఉన్నాయి
లోక్సభలో అధిక, తక్కువ ప్రాతినిధ్యం

నాలుగు రాష్ట్రాలు 31 సీట్ల మేర తక్కువ ప్రాతినిధ్యం పొందుతున్నాయి. ఉత్తరప్రదేశ్ జనాభాతో పోలిస్తే 11 స్థానాలు తక్కువ ఉన్నాయి.

ఐదు రాష్ట్రాలు 26 సీట్ల మేర ఎక్కువ ప్రాతినిధ్యం పొందుతున్నాయి. తమిళనాడు జనాభాతో పోలిస్తే 10కి పైగా స్థానాలు ఎక్కువగా ఉన్నాయి.
లోక్సభలోని 543 స్థానాలను పునర్విభజన చేసి ఉంటే, దక్షిణాది రాష్ట్రాలు జనాభా వృద్ధి ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు తమ సీట్లను కోల్పోవాల్సి వచ్చేది.
జనాభా నియంత్రణ విధానాలు అమలు చేసినందుకు తాము శిక్ష అనుభవిస్తున్నామని దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు గతంలో అన్నది ఇందుకే. ‘‘జనాభా నియంత్రణతో ఇక్కడ ప్రతి రాష్ట్రం గణనీయ ప్రగతి చూపించింది.
ఈ చర్య అలాంటి రాష్ట్రాలను శిక్షించేలా ఉంది. ప్రజలకు ప్రాతినిధ్యం వహించేవాళ్లను తగ్గించడం ద్వారా మా బలం తగ్గుతుంది’’ అని పునర్విభజనపై ఐక్య కార్యాచరణ కమిటీ సమావేశంలో తమిళనాడు ముఖ్యమంత్రి, కమిటీ చైర్మన్ స్టాలిన్ వ్యాఖ్యానించారు.
‘‘పార్లమెంట్ స్థానాలు పెంచితే ప్రస్తుతమున్న విధానానికి అనుగుణంగా తమిళనాడు ప్రాతినిధ్యం పెరగాలి. మొత్తం స్థానాల్లో తమిళనాడు ప్రస్తుత ప్రాతినిధ్యం 7.18శాతంగా ఉంది. దీన్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ తగ్గించకూడదు’’ అని తమిళనాడులో జరిగిన మరో అఖిలపక్ష సమావేశంలో స్టాలిన్ డిమాండ్ చేశారు.


South India: దక్షిణాది రాష్ట్రాలు ఆరోగ్యం, విద్య, ఆర్థిక అవకాశాల విషయంలో ఉత్తరాది కంటే మెరుగ్గా ఉన్నాయా
145 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఇంకా ఎక్కువ మంది పిల్లలను కనాలని అంటున్నారు ఎందుకు?
డీలిమిటేషన్: లోక్సభ సీట్ల విభజన చేస్తే దక్షిణాది డమ్మీ అయిపోతుందా?