పొట్టి శ్రీరాములు 'ఆమరణ నిరాహార దీక్ష' భారత దేశ చిత్రపటాన్నే మార్చేసింది.. ఇది ఇప్పటికీ రాజకీయాలను మార్చగలదా?

ఫొటో సోర్స్, Hindustan Times via Getty Images
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
58 రోజుల పాటు సాగిన ఒక నిరాహార దీక్ష భారతదేశ చిత్రపటాన్ని మార్చేసింది.
తెలుగు మాట్లాడే వారి కోసం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని పదేపదే డిమాండ్ చేసినప్పటికీ అప్పటి నెహ్రూ ప్రభుత్వం ఆ డిమాండ్ను తిరస్కరిస్తూ వచ్చింది, దీంతో 1952 అక్టోబర్లో పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు.
గాంధేయవాది అయిన శ్రీరాములు అంతకు ముందు కూడా కొన్ని సమస్యల పరిష్కారం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఆత్మ త్యాగమొక్కటే దిల్లీని కదిలించగలదని ఆయన విశ్వసించారు.
అదే జరిగింది.
దీక్ష చేపట్టిన 58వ రోజున శ్రీరాములు చనిపోయారు. తెలుగు మాట్లాడే ప్రాంతాల్లో ప్రజలు తండోపతండాలుగా వీధుల్లోకి వచ్చారు. ప్రభుత్వ భవనాలపై దాడులు జరిగాయి. రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. ఈ ఆందోళనల్లో అనేక మంది చనిపోయారు. కొద్దిరోజుల తర్వాత నెహ్రూ ఆంధ్రరాష్ట్ర ఏర్పాటు గురించి ప్రకటన చేశారు. కొన్నేళ్లలోనే రాష్ట్రాల పునర్వవస్థీకరణ కమిషన్ ఏర్పాటు చేసి భాష ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటు చేశారు.

కొంతమంది చేసిన ఆమరణ నిరాహార దీక్షలు దేశంపై బలమైన ముద్ర వేశాయి. "పొట్టి శ్రీరాములును నేటి తరం మర్చిపోయింది. ఇది విచారకరం. దేశ చరిత్ర, భౌగోళిక స్వరూపంపై ఆయన ప్రభావం సామాన్యమైనది కాదు" అని చరిత్రకారుడు రామచంద్ర గుహ రాశారు. ఒక వ్యక్తి ఖాళీ కడుపు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశపు పటాన్ని మార్చేసింది.
బహుశా అందుకే కావొచ్చు.. 70 ఏళ్లు దాటుతున్నా భారతీయులు ఇప్పటికీ నిరాహార దీక్షను ఒక సహజ నిరసన మార్గంగా ఎంచుకుంటున్నారు. దీనికి తాజా ఉదాహరణ విద్యావేత్త, పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్చుక్. నిరవధిక నిరాహార దీక్ష కారణంగా ఆయన ఆరోగ్యం వేగంగా క్షీణిస్తోందనే ఆందోళనలు పెరుగుతున్నాయి.
59 ఏళ్ల సోనమ్ వాంగ్చుక్ 20 రోజులుగా ఉప్పు నీరు మాత్రమే తాగుతూ 9 కిలోలకుపైగా బరువు కోల్పోయారు.
ఆయనకు మద్దతుగా విద్యా సంస్కరణలు డిమాండ్ చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ కూడా నిరసన చేస్తోంది. దీక్ష విరమించాలని వాంగ్చుక్ను పలువురు ప్రముఖులు కోరారు.
ఆయన ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించాలని, అవసరమైతే చికిత్స అందించాలని దిల్లీ హైకోర్టు ఆదేశించింది.

ఫొటో సోర్స్, Keystone/Getty Images
మహాత్మా గాంధీ - ఆమరణ నిరాహార దీక్ష
భారత్ మాదిరిగా నిరాహార దీక్ష తన రాజకీయ జీవితంలో ఒక భాగమైన దేశం మరొకటి లేదు. ఇతర దేశాల్లో నిరసనకారులు రహదారులను దిగ్బంధిస్తారు లేదా భారీ ప్రదర్శనలు చేస్తారు. భారతీయులు కూడా అవన్నీ చేస్తారు. కానీ, వారు భోజనం చేయడం కూడా మానేస్తారు.
ఈ సంప్రదాయం దేశానికి స్వాతంత్య్రం రాక ముందు నుంచే ఉంది.
హిందూ, బౌద్ధ, జైన మతాలన్నీ స్వచ్ఛంద ఆత్మనిగ్రహానికి ప్రాముఖ్యతను ఇస్తాయి.
ఈ ప్రాచీన భావ వ్యక్తీకరణను మహాత్మాగాంధీ ఆధునిక రాజకీయంగా మలిచారు.
నిరాహార దీక్ష అనేది బ్లాక్ మెయిల్ లేదా ఎదుటివారిని బలవంత పెట్టడానికి కాదని, ప్రజల్లో చైతన్యం కలిగించడానికి ఉద్దేశించిన ఆత్మశోధన చర్యగా ఆయన చెప్పారు.
1918 నుంచి 1948లో ఆయన హత్యకు గురయ్యే వరకు మతపరమైన హింస, కుల వివక్ష, రాజకీయ విభేదాలకు వ్యతిరేకంగా గాంధీజీ అనేకసార్లు నిరాహార దీక్ష చేశారు. ఖాళీ పళ్లాన్ని భారత స్వాతంత్య్ర పోరాట చిహ్నాల్లో ఒకటిగా మలిచారు.
గాంధీ కనీసం 15 సార్లు నిరాహార దీక్ష చేశారని అంచనా. ఆయన అత్యంత సుదీర్ఘమైన ఉపవాసం 21 రోజులు కొనసాగింది.
1948 జనవరిలో చేసిన ఆయన చివరిసారి చేసిన నిరాహార దీక్ష ఐదు రోజులు జరిగింది. దిల్లిలో సామాజిక సామరస్యాన్ని పునరుద్ధరించడానికి ఇది సాయపడింది.
"కత్తికి బదులు ఉపవాసమే చివరి అస్త్రం" అని గాంధీ తన చివరి ఉపవాసానికి ముందు 1948లో రాశారు.
1947లో మతకలహాలు చెలరేగినప్పుడు వాటిని ఆపేందుకు గాంధీ కలకత్తా( ప్రస్తుత కోల్కతా)లో నిరాహార దీక్ష చేపట్టారు. అప్పుడు బ్రిటిష్ యాజమాన్యంలోని స్టేట్స్మన్ పత్రిక "రాజకీయ సాధనంగా నిరాహార దీక్ష చేపట్టే నైతికత గురించి.. ఎన్నో ఏళ్లుగా భారతదేశపు అత్యంత ప్రసిద్ధ ఉపవాస దీక్షాపరుడితో(గాంధీ) మేం ఏకీభవించలేకపోయాం. మా దృష్టిలో ఇంత సరళమైన, విలువైన కారణం కోసం మహాత్మా గాంధీ ఎప్పుడూ ఉపవాసం చేయలేదు. ప్రజల మనస్సాక్షిని వెంటనే, ప్రభావవంతంగా తట్టిలేపేందుకు ఇంతకంటే సరైనది మరోటి లేదు" అని రాసింది.
స్వతంత్ర భారత దేశం ఈ సంప్రదాయాన్ని వారసత్వంగా స్వీకరించింది. రైతుల హక్కులు, రిజర్వేషన్లు, పర్యావరణ పరిరక్షణ, అవినీతి వ్యతిరేక చట్టాలు, అలాగే వివాదాస్పద భద్రతా చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్లతో అనేక నిరాహార దీక్షలు జరిగాయి.

ఫొటో సోర్స్, Hindustan Times via Getty Images
సామాజికర కార్యకర్త అన్నా హజారే 2011లో చేపట్టిన 13 రోజుల నిరాహార దీక్ష అవినీతి వ్యతిరేక ఉద్యమానికి కొత్త ఊపునిచ్చింది.
భారతదేశ ఈశాన్య ప్రాంతంలో అమల్లో ఉన్న కఠినమైన సాయుధ దళాల (ప్రత్యేక అధికారాలు) చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ ఇరోమ్ షర్మిల 16 సంవత్సరాల పాటు ఆహారం తీసుకోవడానికి నిరాకరించారు.
అధికారులు ముక్కు ద్వారా గొట్టం వేసి బలవంతంగా ఆహారం అందించడంతోనే ఆమె ప్రాణాలతో నిలిచారు.
నదులపై భారీ ఆనకట్టలు కట్టి నిర్మించే ప్రాజెక్టుల వల్ల నిర్వాసితులైన ప్రజలకు న్యాయమైన పరిహారం, పునరావాసం కల్పించాలని డిమాండ్ చేస్తూ సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ అనేకసార్లు దీర్ఘకాలిక నిరాహార దీక్ష చేశారు.
"నిరాహార దీక్షలు ప్రపంచవ్యాప్తంగా కనిపించే నిరసన రూపాలు. అవి భారత్కు మాత్రమే ప్రత్యేకమైనవి కావు" అని రాజకీయ నిరాహార దీక్షలపై అధ్యయనం చేసిన కనెక్టికట్ యూనివర్సిటీలో ఆంథ్రోపాలజిస్ట్ సాయంతన్ సాహా రాయ్ అన్నారు.
బ్రిటిష్ వలసవాదానికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష ఉమ్మడి భాషగా అవతరించింది. బ్రిటన్లో మహిళలకు ఓటు హక్కు కోసం పోరాడిన సఫ్రజెట్లు, ఐర్లాండ్, భారత్లోని జాతీయవాదులు ప్రజాస్వామ్య, వలసవాద వ్యతిరేక నిరసనల కోసం ఒక ఉమ్మడి సాధనంగా దీనిని మలుచుకున్నారు.
"అయితే, భారతదేశంలో ప్రభుత్వాలు ప్రజల డిమాండ్లను పట్టించుకోని సమయంలో అధికారంలో ఉన్నవారిలో చలనం తీసుకురావడానికి నిరాహార దీక్షే ఏకైక మార్గమని నిరసనకారులు తరచుగా భావిస్తారు" అని సాహా రాయ్ చెప్పారు.
"గాంధీ భారత్లో నిరాహార దీక్షను శాశ్వత, నైతిక రాజకీయ చర్యగా మార్చడంతో అది ప్రత్యేక సంప్రదాయంగా మారింది" అని సాహా అభిప్రాయపడ్డారు.
"స్వార్థ ప్రయోజనాలకు పెద్ద పీట వేసే రాజకీయ ప్రపంచంలో నిరాహార దీక్షలు ఆత్మత్యాగానికి ప్రతీకలుగా నిలుస్తాయి. నిరసనకారుడి శరీరం బలహీనపడుతున్న కొద్దీ, అధికారంలో ఉన్నవారిపై నైతిక రాజకీయ ఒత్తిడి పెరుగుతుంది" అని సాహా చెప్పారు.
అయితే, ఆ ఒత్తిడి ప్రజలపై ఆధారపడి ఉంటుంది.
"నిరాహార దీక్షలు ప్రభావవంతంగా ఉండాలంటే అవి ప్రజల్లోకి వెళ్లాలి. అవి కేవలం ప్రభుత్వాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకోవు. అందులో ప్రజలకు భాగస్వామ్యం ఉంటుంది. ఎందుకంటే ప్రజల ఆగ్రహమే అధికారంలో ఉన్నవారిపై ఒత్తిడిని తీసుకురాగలదు" అని సాహా రాయ్ చెప్పారు.
దీనికి ఉదాహరణగా ఆయన 1970, 1980లలో జరిగిన ఐరిష్ నిరాహార దీక్షలను ప్రస్తావిస్తున్నారు.
"ఆ నిరసనకారులు (తమను నేరస్థులుగా కాకుండా రాజకీయ ఖైదీలుగా చూడాలని కోరిన ఐరిష్ రిపబ్లికన్లు] తమ బాధను స్పష్టంగా చూపించడం ద్వారా అలాగే మరణాన్ని సైతం స్వీకరించడం ద్వారా ఐరిష్ ప్రజలను చైతన్యపరచడానికి ప్రయత్నించారు. ప్రభుత్వ క్రూరత్వానికి సాక్ష్యంగా ఆకలితో కృశించిన తమ శరీరాన్ని సాక్ష్యంగా ప్రజలకు చూపించాలనుకున్నారు. అయితే, ప్రభుత్వం తప్పనిసరిగా స్పందిస్తుందనే గ్యారంటీ లేదు. ఇలాంటి పరిస్థితి నిరాహార దీక్షలను చులకనగా మారుస్తుంది" అని సాహా చెప్పారు.
నిరాహార దీక్షలకు నైతిక శక్తి ఉన్నప్పటికీ, వాటిపైనా విమర్శలు ఉన్నాయి.

ఫొటో సోర్స్, The India Today Group via Getty Images
విమర్శకుల మాటేంటి?
గాంధీ నిరాహార దీక్షను ఒక నైతిక ఆయుధంగా ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు. అయితే, భారతదేశపు అత్యుత్తమ రాజనీతిజ్ఞులలో ఒకరైన బీఆర్ అంబేడ్కర్ స్వతంత్ర భారతదేశంలో నిరాహార దీక్షల పట్ల సందేహవాదిగా ఉన్నారు.
అంబేడ్కర్1949లో చేసిన చారిత్రక ప్రసంగంలో "రాజ్యాంగబద్ధమైన మార్గాలు అందుబాటులో ఉన్నప్పుడు నిరాహార దీక్ష, శాసనోల్లంఘన వంటి పద్ధతులు పక్కకు తప్పుకుని ప్రజాస్వామ్య ప్రక్రియలకు మార్గం ఇవ్వాలని" వాదించారు. అలా చేయకుంటే అవి "అరాచకత్వానికి వ్యాకరణం"గా మారతాయని హెచ్చరించారు. "వాటిని ఎంత త్వరగా విడిచిపెడితే అంత మంచిది" అని అన్నారు.
ఆ చర్చ ముగియలేదు. ఇటీవలి సంవత్సరాల్లోనూ రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్య దేశంలో నిరాహార దీక్షలకు స్థానం ఉందా అని విమర్శకులు ప్రశ్నిస్తూనే ఉన్నారు.
2011లో అన్నా హజారే అవినీతి వ్యతిరేక నిరాహార దీక్ష సందర్భంగా రాజకీయ తత్వవేత్త ప్రతాప్ భాను మెహతా రాసిన వ్యాసంలో ఇటువంటి నిరసనలు " బలవంతపు ఒత్తిడిగా" మారవచ్చని వాదించారు.
సాధ్యం కాని డిమాండ్లతో నిరాహార దీక్ష చేస్తే అది బ్లాక్మెయిల్తో సమానం అని ఆయన రాశారు.
దీనికి తగ్గట్లే నిరాహార దీక్షలపై ప్రజల్లో నమ్మకం తగ్గుతోంది. రాజకీయ నాయకులు తెరచాటుగా భోజనం చేస్తున్నారని, లేదా తమ దీక్షలను విలాసవంతమైన విందులతో ముగిస్తున్నారని సామాజిక మాధ్యమాల్లో జోకులు వేస్తున్నారు.
కొన్ని నిరాహార దీక్షలు కేవలం కొన్ని గంటలే ఉంటాయి. మరికొన్ని బ్యానర్లు, వేదికలు, టీవీల్లో ప్రత్యక్ష ప్రసారాలతో కట్టుదిట్టంగా రూపొందించిన మీడియా ప్రదర్శనలుగా ఉంటాయి.
సూటిగా చెప్పాలంటే ప్రతీ నిరాహార దీక్షకు రాజకీయ ప్రాధాన్యత ఉండదు. చరిత్ర కూడా ఇదే విషయాన్ని సూచిస్తోంది.
పొట్టి శ్రీరాములు మరణం భారత సమాఖ్య(రాష్ట్రాల సమూహం) రూపురేఖలనే మార్చేసింది. హజారే నిరసన దేశంలో కొంతకాలం అవినీతి వ్యతిరేక ఉద్యమానికి ఊపుతెచ్చినా, దాని ప్రభావం తర్వాతి కాలంలో కనుమరుగైంది. ఇరోమ్ షర్మిల అంతర్జాతీయంగా నిరసనకు ప్రతీకగా నిలిచినప్పటికీ, ఆమె వ్యతిరేకించిన ఆ కఠిన చట్టం మాత్రం ఇంకా అమల్లోనే ఉంది.

ఫొటో సోర్స్, India Today Group via Getty Images
వాంగ్చుక్ ఆమరణ నిరాహార దీక్ష ఏం కానుంది?
మరోవైపు, తమకు ఇష్టం లేకపోయినా ఈ రాజకీయ నాటకాల్లో వైద్యులు భాగస్వాములు కావాల్సి వస్తుంది. రెండు వారాలు ఆహారం లేకుండా గడిచిన తర్వాత, శరీరంలో కొవ్వుతో పాటు కండరాల్లో బలం క్షీణిస్తుంది. ఎలక్ట్రోలైట్ అసమతుల్యత వల్ల హృదయ స్పందనల్లో ప్రాణాంతకమైన లోపాలు ఏర్పడవచ్చు. ఆహారం తీసుకోవడాన్ని వేగంగా మళ్లీ ప్రారంభించడం వల్ల కూడా ప్రమాదాలు ఉన్నాయి. దీర్ఘకాలిక నిరాహార దీక్ష ఒకే సమయంలో అటు రాజకీయ నిరసనగా, ఇటు వైద్య అత్యవసర పరిస్థితిగా పరిణమిస్తుంది.
ఈ విషయం ప్రభుత్వాలకు కూడా తెలుసు. నిరాహార దీక్ష చేస్తున్న వారిని ఆసుపత్రికి తరలించిన తర్వాత బలవంతంగా ఆహారం ఇవ్వడం సాధారణమే. వాంగ్చుక్ శారీరకంగా మరింత బలహీనంగా కనిపించడంతో ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలు, కళాకారులు, సంగీతకారులు ఆయన తన నిరాహార దీక్ష ముగించాలని కోరారు.
ఈ అనుమానాలు, అపనమ్మకాలు ఎలా ఉన్నప్పటికీ.. ఉపన్యాసాలు చేయలేని పని ఉపవాసాల ద్వారా సాధించవచ్చనే దాన్ని భారత్ బలంగా నమ్ముతుంది.
వాంగ్చుక్ నిరాహార దీక్ష కూడా అదే మార్గాన్ని అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. "తన బాధను బహిరంగంగా ప్రదర్శించడం ద్వారా వాంగ్చుక్ గాంధీ చూపిన మార్గాన్నే అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది" అని సాహా రాయ్ అన్నారు.
"ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్న కొద్దీ, ఆయన నిరసనకు మరింత మద్దతు లభిస్తోంది, అలాగే ప్రభుత్వంపై రాజకీయ ఒత్తిడిని కూడా పెంచుతోంది. ఇది చివరకు ఎలా పరిణమిస్తుందో వేచిచూడాల్సి ఉంది."
చివరిగా.. వాంగ్చుక్ నిరాహార దీక్ష నిజంగా ప్రజల అభిప్రాయాలను మార్చగలదా? లేక అలాంటి ఫలితాన్ని సాధించలేకపోయిన త్యాగాల సుదీర్ఘ జాబితాలో మరొకటిగా మాత్రమే మిగిలిపోతుందా? అనేది ఆయన నిరసన భవితవ్యాన్నే కాకుండా, భారతదేశంలోని అత్యంత పురాతన రాజకీయ సంప్రదాయాల్లో ఒకటైన ఈ ఉపవాస దీక్షకున్న శాశ్వత ప్రభావాన్ని కూడా నిర్ణయించవచ్చు
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)
































